|
FONT size=3>
కడపలో ప్రపంచస్థాయి కేంద్ర విశ్వవిద్యాలయం
700 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో 700 ఎకరాల్లో ప్రపంచ స్థాయి కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. దీనికయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. సోమవారం (05/05/2008) సచివాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధ్యక్షతన ఉన్నత విద్యపై జరిగిన సమీక్ష సమావేశంలో కడప జిల్లాను ఎంపిక చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను ఉన్నతవిద్య శాఖ మంత్రి చెంగారెడ్డి వెల్లడించారు. కేంద్ర మానవ వనరుల శాఖ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఇందుకోసం 700 ఎకరాల స్థలం కావాలని అడిగిందని చెప్పారు. విశాఖపట్నం, కడపలలో స్థలం గురించి పరిశీలించగా, కడపలో మాత్రమే దొరికిందని చెప్పారు. రాష్ట్రానికి మంజూరైన ఐఐటీ తరగతులను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. శాశ్వత నిర్మాణాల కోసం 500 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం తాజాగా రూ.19 కోట్లు విడుదల చేసిందన్నారు. తాత్కాలికంగా మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి అనుమతివ్వాలని కేంద్ర రక్షణ మంత్రికి సీఎం లేఖలు రాయడంతో పాటు స్వయంగా మాట్లాడారని చెప్పారు. చెన్నై ఐఐటీ నిపుణుల బృందం ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు చేపట్టాలని సూచించిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో నన్నయ విశ్వవిద్యాలయానికి భూసేకరణ సత్వరమే పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ వివరాలు తర్వాత ప్రకటిస్తామని మంత్రి చెంగారెడ్డి వివరించారు.
(courtsey: Eenadu)
|